News16th Dec 04:24 PMSunil Byrisetty1 min read
ప్రజలపై వైద్య ఖర్చుల భారం తగ్గేలా కార్యాచరణ
ప్రజారోగ్య పరిరక్షణకు మెరుగైన విధానాలను అవలంబిస్తూ ప్రజలకు సేవలు అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ మేరకు అందుబాటులో ఉన్న టెక్నాలజీని వినియోగించుకోవడంతోపాటు
ప్రజారోగ్య పరిరక్షణకు మెరుగైన విధానాలను అవలంబిస్తూ ప్రజలకు సేవలు అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ మేరకు అందుబాటులో ఉన్న టెక్నాలజీని వినియోగించుకోవడంతోపాటు... నిపుణుల సలహాలను తీసుకోవాలని సీఎం సూచించారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో వైద్యారోగ్య శాఖపై సమీక్షించారు. గేట్స్ ఫౌండేషన్ తో కలిసి వైద్యారోగ్య రంగంలో ప్రభుత్వం అమలు చేస్తోన్న సంజీవని సహా వివిధ ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు చర్చించారు. ఏపీలో మెరుగైన ప్రజారోగ్య నిర్వహణకు గేట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వైద్యారోగ్య రంగంలోని నిపుణులతో కూడిన 10 మంది సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేశారు. యూఎన్ఎయిడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పీటర్ పాయిట్, ప్రపంచ ఆరోగ్య సంస్థ సీనియర్ శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్, తదితర అత్యున్నతస్థాయి నిపుణుల సలహా బృందంలో ఉన్నారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ..”వైద్యారోగ్య రంగంలో వివిధ ప్రమాణాలను అందుకునేలా డబ్ల్యూహెచ్ఓ లాంటి సంస్థలు నిర్దేశించిన అంశాలను అమలు చేస్తున్నాం. ప్రజల డిజిటల్ హెల్త్ రికార్డులను సంజీవని ప్రాజెక్టు ద్వారా రూపొందిస్తున్నాం. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో కుప్పం, చిత్తూరు జిల్లాల్లో డిజిటల్ నెర్వ్ సెంటర్ ద్వారా ఈ వివరాలను సేకరించి ఇంటిగ్రేట్ చేశాం. రియల్ టైమ్ లోనే వారి వివరాలు తెలుసుకునేలా సంజీవని ప్రాజెక్టు పని చేస్తుంది. వివిధ అంశాల్లో ప్రజలకు సంబంధించిన ఆరోగ్య సమాచారం అందుబాటులో ఉంటుంది.త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రాజెక్టును అమలు చేస్తాం”అని సీఎం చెప్పారు.