Health27th Jul 04:53 PMSunil Byrisetty1 min read
పీహెచ్సీల పనితీరుకు ‘ఆరోగ్య ఫలితాలే’ ప్రామాణికం
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (PHC) పనితీరు మదింపులో కూటమి ప్రభుత్వం సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. ఎంతమంది రోగులకు సేవలందించారు? ఎన్ని పరీక్షలు చేశారు? ఎన్ని ప్రసవాలు నిర్వహించారు?
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (PHC) పనితీరు మదింపులో కూటమి ప్రభుత్వం సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. ఎంతమంది రోగులకు సేవలందించారు? ఎన్ని పరీక్షలు చేశారు? ఎన్ని ప్రసవాలు నిర్వహించారు? అనే లెక్కలను మాత్రమే కాకుండా... అందించిన వైద్య సేవల వల్ల ప్రజల ఆరోగ్యంలో ఎంత మార్పు వచ్చింది? మాతా శిశు మరణాలు తగ్గాయా? రక్తపోటు, మధుమేహ రోగులకు నిరంతర చికిత్స అందుతోందా? లేదా? సేవలపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారా? అనే ఫలితాల ఆధారంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పనితీరును గుర్తించనున్నారు.
ఇందుకోసం మొత్తం 21 కీలక పనితీరు సూచికలతో కొత్త ర్యాంకింగ్, గ్రేడింగ్ విధానాన్ని ప్రభుత్వం రూపొందించింది. ప్రస్తుతం 5 అంశాల ఆధారంగానే వైద్యారోగ్య శాఖ ర్యాంకులను ప్రకటిస్తోంది. ఓపీ (OP) విధానంలో రోగుల సంఖ్య, ఆసుపత్రిలో చేరినవారు, ల్యాబ్ పరీక్షలు, ప్రసవాలు, గర్భనిరోధక సాధనాల వాడకం వంటి ఐదు అంశాల ఆధారంగానే పీహెచ్సీల పనితీరును అంచనా వేసేవారు. ఈ విధానంలో సేవల సంఖ్య మాత్రమే తెలుస్తోందని... వ్యాధుల నివారణలో సాధించిన పురోగతి, మాతా శిశు ఆరోగ్య ఫలితాలు, దీర్ఘకాలిక వ్యాధుల నియంత్రణ, రోగులకు నిరంతర చికిత్స వంటి కీలక అంశాలు ప్రతిబింబించడం లేదని అధికారుల పునస్సమీక్షలో తేలింది. సేవలు మెరుగుపడాలంటే 21 కొలమానాల ఆధారంగా ర్యాంకులను ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది.