Politics16th Dec 04:20 PMSunil Byrisetty1 min read
పీపీపీపై రాజకీయాలొద్దు: జగన్కు మంత్రి సూచన
వైయస్ జగన్ రాజకీయాలు చేయవచ్చు కానీ అవగాహనా రాహిత్యంతో కేవలం ఉనికి కాపాడుకోవడానికి చేయడం తగదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలోనూ పీపీపీ విధాన
వైయస్ జగన్ రాజకీయాలు చేయవచ్చు కానీ అవగాహనా రాహిత్యంతో కేవలం ఉనికి కాపాడుకోవడానికి చేయడం తగదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలోనూ పీపీపీ విధానంలో పోర్టులను అప్పగించిన విషయాన్ని ప్రస్తావించారు. కోటి సంతకాల పేరుతో ప్రైవేటీకరణను అడ్డుకుంటామని మాట్లాడుతున్నారని, ఇప్పటికీ జగన్ కు ప్రైవేటైజేషన్ కి, పీపీపీకి తేడా తెలియడం లేదా అని ప్రశ్నించారు. ప్రజల్లో స్పందన లేకపోయినా తప్పుదారి పట్టించాలని చూడటం తగదన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించడంలో భాగంగా ప్రభుత్వం కొత్తగా నిర్మించే వైద్య కళాశాలలను పీపీపీ కింద నిర్మిస్తోందని మంత్రి సత్యకుమార్ చెప్పారు. ఐదేళ్లలో 8500 కోట్లకుగాను 1500 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి, తానే నిర్మించానని, 150 సీట్లు తేవాలనుకున్నానని చెబుతూ ఐదేళ్లు గడిపేశారన్నారు. పీపీపీ విధానంలో రహదారుల నిర్మాణాలు జరుగుతున్నాయని, శంషాబాద్ లో పీపీపీ విధానంలో నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయంతో అభివృద్ధి వేగంగా జరిగిందని గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో పోర్టులను ప్రైవేటుపరం చేసిన వైసీపీ నేతలు నేడు పీపీపీ విధానాన్ని విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విధానం ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లోనే కాదని, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ లో అమలవుతోందని, ఢిల్లీలోనూ 11 కళాశాలలను ఈ విధానంలో నిర్మించబోతున్నారని మంత్రి సత్యకుమార్ వివరించారు.