News14th Aug 04:08 PMSunil Byrisetty1 min read
అసెంబ్లీలో హైస్పీడ్ ముద్రణా యంత్రాలు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన వ్యవస్థ భవనంలో రూ. కోటిన్నర వ్యయంతో ఏర్పాటు చేసిన అత్యాధునిక హైస్పీడ్ ముద్రణా యంత్రాలను అసెంబ్లీ భవనంలో శాసన సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు, అసెంబ్లీ సె
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన వ్యవస్థ భవనంలో రూ. కోటిన్నర వ్యయంతో ఏర్పాటు చేసిన అత్యాధునిక హైస్పీడ్ ముద్రణా యంత్రాలను అసెంబ్లీ భవనంలో శాసన సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు, అసెంబ్లీ సెక్రటరీ-జనరల్ ప్రసన్న కుమార్ సూర్యదేవరతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నూతనంగా ప్రారంభించిన ఈ అత్యాధునిక ముద్రణా యంత్రాలు శాసన సభ సమావేశాల్లోను, మరీ ముఖ్యంగా బజ్డెట్ ప్రవేశపెట్టే సమయంలోను కీలకపాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. అంతేగాక శాసన సభకు సంబంధించిన ముద్రణలన్నిటినీ, అంటే ప్రశ్నలు, అజెండా పత్రాలు, సభా సంవాదాలు వంటి కీలకమైన పత్రాలను అత్యంత వేగంగా ముద్రించ గలుగుతాయని చెప్పారు. స్పీకర్ గా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఈ ముద్రణా పరికరాలను పరిశీలించానని, వాటిని తక్షణం మార్పుచేయాల్సిన అవసరాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళిన ఫలితంగా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చి మంజూరు చేయగా నేడు అత్యాధునిక ముద్రణా యంత్రాలను ఇక్కడ ఏర్పాటు చేశామన్నారు. వీటితో పాటు కర్నూల్ లోగల ప్రభుత్వ ముద్రణాలయానికి కూడా మరో కోటి రూ.లతో ముద్రణ యంత్రాలను ఏర్పాటు చేయడం జరుగుతోందని అయ్యన్న వివరించారు.