News3rd Aug 06:25 PMSunil Byrisetty1 min read
జీవో 102ను తక్షణమే రద్దు చేయాలి!
రాష్ట్రంలోని మెడికల్, డెంటల్ కళాశాలల అడ్మిషన్ల కోసం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ తాజాగా విడుదల చేసిన జీవో నంబర్ 102ను తక్షణమే ఉపసంహరించుకోవాలని భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్
రాష్ట్రంలోని మెడికల్, డెంటల్ కళాశాలల అడ్మిషన్ల కోసం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ తాజాగా విడుదల చేసిన జీవో నంబర్ 102ను తక్షణమే ఉపసంహరించుకోవాలని భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షులు బోడె రామచంద్రయాదవ్ డిమాండ్ చేశారు. ఈ జీవో ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ అభ్యర్థులకు, ముఖ్యంగా బీసీ విద్యార్థులకు తీవ్ర నష్టం చేకూర్చేలా కుట్ర పన్నిందని ఆయన మండిపడ్డారు. గతంలో 2019లో మాన్యువల్ అడ్మిషన్ల నుంచి ఆన్లైన్ విధానానికి మారినప్పుడు ఆప్షన్లు ఎంచుకునే ప్రక్రియలో రిజర్వేషన్ అభ్యర్థులకు నష్టం జరుగుతోందని కొందరు హైకోర్టును ఆశ్రయించారని గుర్తు చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా 2020లో ప్రభుత్వం జీవో నంబర్ 151ను తీసుకువచ్చిందని వివరించారు. గత ఆరేళ్లుగా ఈ జీవో 151 ప్రకారమే అడ్మిషన్లు జరుగుతున్నాయని, దీనివల్ల ఓసీ అభ్యర్థులకు గానీ, రిజర్వేషన్ అభ్యర్థులకు గానీ ఎలాంటి నష్టం జరగకుండా ప్రక్రియ సాఫీగా కొనసాగుతోందని స్పష్టం చేశారు. ఇప్పుడు కొత్తగా జీవో 102 ద్వారా బీసీలకు అన్యాయం చేయాలని చూస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. రిజర్వేషన్ అభ్యర్థులకు నష్టం చేసేలా ముందుకు వెళితే, బీసీ, రిజర్వేషన్ విద్యార్థులతో కలిసి బీసీవై పార్టీ పక్షాన పోరాటం చేస్తామని హెచ్చరించారు.