News4th Dec 03:54 PMSunil Byrisetty1 min read
గ్రామ స్వరాజ్య స్థాపనకు కూటమి ప్రభుత్వం అడుగులు
గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్య స్థాపనకు ఎన్డిఏ కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని, అందులో భాగంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి డివిజన్ స్థాయిలో డివిజినల్ డెవలప్మె
గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్య స్థాపనకు ఎన్డిఏ కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని, అందులో భాగంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి డివిజన్ స్థాయిలో డివిజినల్ డెవలప్మెంట్ ఆఫీసులను ఏర్పాటు చేయడం జరిగిందని డిప్యూటీ సిఎం కొణిదెల పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గురువారం పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి చిత్తూరు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 77 డివిజినల్ డెవలప్మెంట్ ఆఫీసులను డిప్యూటీ సిఎం కొణిదెల పవన్ కళ్యాణ్ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో రాష్ట్రానికి సహాయ సహకారాలు అందుతున్నాయని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఎన్డిఏ కూటమి ప్రభుత్వం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలలో పలు సంస్కరణలు తీసుకువచ్చిందన్నారు. 73వ రాజ్యాంగ సవరణ స్ఫూర్తితో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లో పలు సంస్కరణలు తీసుకొచ్చామని, ఇందులో భాగంగా రాష్ట్రంలో 77 డివిజినల్ డెవలప్మెంట్ ఆఫీసులను ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ కార్యాలయాల్లో పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి డిడిఓ, డి ఎల్ పి ఓ, ఏపిడి, డ్వామా ఇతర అధికారులు సేవలందించనున్నారన్నారు. డివిజినల్ డెవలప్మెంట్ కార్యాలయాల ఏర్పాటుతో ప్రతి పంచాయతీ స్వయం ప్రతిపత్తి కలిగి స్వతంత్రంగా వ్యవహరిస్తూ ప్రజల అవసరాలను తీర్చగలమని తెలిపారు. క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యకలాపాల ను సమీకృతం చేస్తూ నిరంతర పర్యవేక్షణ చేయవచ్చున్నారు.