News29th Aug 02:59 PMSunil Byrisetty1 min read
పల్లె ప్రగతితోనే వికసిత్ భారత్..
పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు.. గ్రామాల సుస్థిర అభివృద్ధితోనే దేశ ప్రగతి సాధ్యమని బలంగా నమ్మిన మహాత్ముని ఆశయాల సాధనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమంతో పాటు ఎన్
పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు.. గ్రామాల సుస్థిర అభివృద్ధితోనే దేశ ప్రగతి సాధ్యమని బలంగా నమ్మిన మహాత్ముని ఆశయాల సాధనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమంతో పాటు ఎన్నో అభివృద్ధి పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్నాయని, వీటి ఆసరాతో వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర సాధనకు సమష్టిగా కృషిచేయాల్సిన అవసరముందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు.
పంచాయతీ అభివృద్ధి సూచిక (పీఏఐ- Panchayat Advancement Index) 2.0పై విజయవాడలోని పంచాయతీరాజ్ శాఖ సమావేశ మందిరంలో కార్యశాల జరిగింది. జెడ్పీటీసీలు, ఎంపీడీవోలు తదితరులు హాజరైన ఈ వర్క్షాప్నకు కలెక్టర్ లక్ష్మీశ హాజరయ్యారు. మహాత్మాగాంధీ, డా. బీఆర్ అంబేద్కర్ చిత్రపటాలతో పాటు ఆధునిక తెలుగు భాష వైతాళికుల్లో ఒకరైన గిడుగు వేంకట రామమూర్తి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ ఐరాస సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్డీజీ) సాధనలో భాగంగా గ్రామ పంచాయతీల సంస్థాగత సామర్థ్యాలను పెంచేందుకు, ప్రగతిని నిరంతరం పర్యవేక్షించేందుకు కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ పీఏఐ 1.0ను రూపొందించిందని.. ఇప్పుడు దీన్ని ఆధునికీకరించి పీఐఏ 2.0గా మార్చడం జరిగిందన్నారు. ఈ సూచీ కింద పేదరికం లేని, మెరుగైన జీవనోపాధులు కలిగిన పంచాయతీ; ఆరోగ్యకరమైన గ్రామ పంచాయతీ, బాలిక స్నేహపూర్వక గ్రామ సంచాయతీ, నీరు సమృద్ధిగల గ్రామ పంచాయతీ, పచ్చదనం, పరిశుభ్రత కలిగిన గ్రామ పంచాయతీ, స్వయం సమృద్ధి, మౌలిక సదుపాయాలు కలిగిన గ్రామ పంచాయతీ, సామాజిక న్యాయం-సామాజిక భద్రత కలిగిన గ్రామ పంచాయతీ, సుపరిపాలన కలిగిన గ్రామ పంచాయతీ, మహిళా స్నేహపూర్వక గ్రామ పంచాయతీ అనే తొమ్మిది ఇతివృత్తాల్లో 147 సూచికలు ఉన్నట్లు వివరించారు.