News21st Aug 03:23 PMSunil Byrisetty1 min read
ప్రకృతికి నచ్చేలా.. గణపతి మెచ్చేలా.!
వినాయక చవితి ఉత్సవాల్లో కాలుష్యానికి చెక్ పెట్టి, పర్యావరణ హితంగా పండగలను జరుపుకునేలా ప్రజలను జాగృతం చేసేందుకు వినూత్న ఆలోచనలతో ముందుకెళ్తున్నామని.. ఈసారి మట్టి ప్
వినాయక చవితి ఉత్సవాల్లో కాలుష్యానికి చెక్ పెట్టి, పర్యావరణ హితంగా పండగలను జరుపుకునేలా ప్రజలను జాగృతం చేసేందుకు వినూత్న ఆలోచనలతో ముందుకెళ్తున్నామని.. ఈసారి మట్టి ప్రతిమల తయారీతో ప్రపంచ రికార్డు నెలకొల్పేందుకు కృషిచేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. కృత్రిమ రంగులు, రసాయనాలు, థర్మోకోల్ వంటి వాటి వినియోగం వల్ల పర్యావరణానికి పెను ముప్పు ఏర్పడుతుందని.. భావితరాలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని బహుమతిగా అందించాలంటే ప్రతిదాంట్లో పర్యావరణ హిత మార్గాలను అనుసరించాల్సిన అవసరముందన్నారు. యోగా ఔన్నత్యాన్ని చాటిచెప్పే క్రమంలో ప్రపంచ రికార్డు నెలకొల్పామని... ఇదేవిధంగా వినాయక చవితి ఉత్సవాల్లో మట్టి ప్రతిమలను పూజించి ప్రకృతి శోభతో ఆధ్యాత్మిక వాతావరణంలో పండగను జరుపుకునేలా ప్రోత్సహించేందుకు కాలుష్య నియంత్రణ మండలి, విజయవాడ నగరపాలక సంస్థ, జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో ప్రపంచ రికార్డుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. ఈ నెల 26న ఒక నగరంలో అత్యధిక సంఖ్యలో మట్టి ప్రతిమలను తయారు చేసి ఈ రికార్డు నెలకొల్పనున్నట్లు వివరించారు. వివిధ పాఠశాలలతో పాటు ఇందిరాగాంధీ మునిసిపల్ మైదానంలో ఇందుకు ఏర్పాట్లు చేస్తున్నామని.. స్వచ్ఛంద సంస్థలు, అసోసియేషన్లను కూడా పెద్దఎత్తున భాగస్వాములను చేస్తున్నట్లు వివరించారు. ప్రజలు కూడా తమ ఇళ్ల వద్ద మట్టి వినాయకులను తయారుచేసి వాటి ఫొటోలను 91549 70454 నంబరుకు వాట్సాప్ చేయాలని సూచించారు. ఈ నంబర్కు కాల్చేసి కార్యక్రమానికి సంబంధించిన వివరాలు కూడా తెలుసుకోవచ్చన్నారు.