News2nd Dec 04:26 PMSunil Byrisetty1 min read
స్వర్ణాంధ్ర ప్రయాణంలో అడుగులు కలపండి
స్వర్ణాంధ్ర, వికసిత్ భారత్ లక్ష్యాల సాధనకు చేస్తున్న ప్రయాణంలో ఉద్యోగులు అడుగులు కలిపి రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో కీలక భాగస్వాములు కావాలని మంత్రి కొలుసు పార్థసారథి కోర
స్వర్ణాంధ్ర, వికసిత్ భారత్ లక్ష్యాల సాధనకు చేస్తున్న ప్రయాణంలో ఉద్యోగులు అడుగులు కలిపి రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో కీలక భాగస్వాములు కావాలని మంత్రి కొలుసు పార్థసారథి కోరారు. ఏపీ ఎన్జీజీవో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్ నేతృత్వంలో పలువురు అసోసియేషన్ నాయకులు మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి పార్థసారథిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి ఉద్యోగ సంఘ నాయకులతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి విజన్ @ 2047 సాధన వైపు చేస్తున్న ప్రయాణంలో ఉద్యోగులు అడుగులు కలిపి సహకరించేందుకు ముందుండాల్సిన అవసరముందన్నారు. కొన్నేళ్లపాటు అభివృద్ధిలో గాడి తప్పిన రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి తన అపార అనుభవం, దార్శనికతతో అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తున్నారన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలతో పాటు కీలకమైన పారిశ్రామిక, సేవా రంగాల్లో అభివృద్ధికి అహర్నిశలు కృషిచేస్తున్నారన్నారు. విశాఖ భాగస్వామ్య సదస్సు విజయవంతం కావడమే కాకండా అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సులో రికార్డు స్థాయిలో పెట్టుబడులు సాధించినట్లు వివరించారు. ఈ పెట్టుబడుల ద్వారా మన యువతకు సుస్థిర ఉపాధి అవకాశాలతో పాటు అభివృద్ధి పరుగులు పెట్టనుందన్నారు. ఈ తరుణంలో అభివృద్ధి కార్యాచరణ అమల్లో ఉద్యోగులు సహకారం ఎంతో కీలకమన్నారు. ఉద్యోగ సమాచారం మాస పత్రికలో ప్రభుత్వ నిర్వహిస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల కథనాలు ప్రచురించాలని కోరారు.ఉద్యోగుల సమస్యలను దశల వారీగా పరిష్కరిచేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని.. ఈ విషయంలో ఎలాంటి సందేహాలకు తావులేదన్నారు.