News25th Aug 05:38 PMSunil Byrisetty1 min read
అఖండ గోదారిని ఆరాధించేలా పుష్కరాలు
ప్రకృతి ఆరాధన-ఆధ్యాత్మిక చింతన మమేకం చేస్తూ గోదావరి పుష్కరాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. ఎక్కడా పవిత్రత దెబ్బతినకుండా, భక్తులకు సమస్యలు తలెత్తకుండా ఇ
ప్రకృతి ఆరాధన-ఆధ్యాత్మిక చింతన మమేకం చేస్తూ గోదావరి పుష్కరాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. ఎక్కడా పవిత్రత దెబ్బతినకుండా, భక్తులకు సమస్యలు తలెత్తకుండా ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 7 వరకు 12 రోజుల పాటు పుష్కరాలు అత్యంత వైభవంగా జరపాలని చెప్పారు. పుష్కరాలు కేవలం ప్రభుత్వం నిర్వహించడమే కాదని, స్థానిక ప్రజలను భాగస్వాములను చేయాలన్నారు. పుష్కరాల్లో భాగంగా రూ.4,026 కోట్లతో చేపట్టిన 4,932 పనులకు సంబంధించి పురోగతిపై సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ పనులకు సంబంధించి ఇప్పటికే రూ.899 కోట్లు ఆర్ధిక శాఖ కేటాయింపులు జరిగాయని అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి తెలిపారు. తూర్పు గోదావరి జిల్లాలో 1,869, పశ్చిమ గోదావరి జిల్లాలో 625, కోనసీమ జిల్లాలో 1,501, ఏలూరు జిల్లాలో 426, కాకినాడ జిల్లాలో 321, పోలవరం జిల్లాలో 190 పనులు చేపడుతున్నారు. అయితే ఈ పనుల పూర్తికి అవసరమైన నిధుల సమీకరణపై అధికారులు దృష్టి పెట్టాలని, కేంద్ర సాయం కూడా తీసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు.