Farmers27th Oct 12:18 PMSunil Byrisetty1 min read
కౌలు రైతుల సమస్యలు పట్టని ప్రభుత్వాలు
ఆంధ్రప్రదేశ్లో కౌలురైతులను ఏ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం, పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ కలిసి నిర్వహించిన క్షేత్రస్థాయి సర్వేలో వెల్లడైంది. వారి సమస్య
ఆంధ్రప్రదేశ్లో కౌలురైతులను ఏ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం, పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ కలిసి నిర్వహించిన క్షేత్రస్థాయి సర్వేలో వెల్లడైంది. వారి సమస్యలను ఏ రాజకీయపార్టీ పట్టించుకోవట్లేదని 92.1 శాతం మంది కౌలురైతులు తెలుపగా, పట్టించుకుంటున్నారని కేవలం 6.1, తెలియదని 1.9 శాతం మంది తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కౌలురైతుల సమస్యలపై 20 సెప్టెంబర్ నుండి 20 అక్టోబర్ వరకు ఒక నెలరోజులపాటు ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం క్షేత్రస్తాయిలో 26 జిల్లాల్లో సర్వే నిర్వహించి దాదాపు 3000 శాంపిల్స్ సేకరించింది. ఒక్కొక్క జిల్లా నుంచి 100 నుంచి 125 శాంపిల్స్ సేకరించడం జరిగింది. క్షేత్రస్థాయిలో నిర్వహించిన సర్వే ప్రకారం కౌలురైతుల్లో దాదాపు 70 శాతం మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గాలకు చెందినవారే ఉన్నట్లు వెల్లడైంది. ఈ డేటాను పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ డేటా ఎంట్రీ చేసి, అనాలసిస్ చేసి నివేదికను రూపొందించింది. కౌలురైతులకు గుర్తింపు కార్డు ఇచ్చిందా అని ప్రశ్నించినప్పుడు 87.7 శాతం మంది ఇవ్వలేదని కేవలం 12.3 శాతం మాత్రమే ఇచ్చిందని తెలిపారు. కౌలు రైతుల గుర్తింపునకు ప్రతిబంధకంగా తయారయిన పంట సాగుదారు హక్కు చట్టం (సిసిఆర్సి) స్థానంలో కొత్తగా చట్టం తెస్తామని కూటమి హామీ ఇచ్చినా ఇది అమలుకాకపోవడం పట్ల కౌలురైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు క్షేత్రస్థాయి సర్వేలో వెల్లడైంది.