News25th Dec 04:36 PMSunil Byrisetty1 min read
గిరిజన ప్రాంత ఆసుపత్రులకు డ్రోన్ల ద్వారా మందులు
మారుమూల గిరిజన ప్రాంతాలకు అత్యవసర వైద్య సేవలను చేరువ చేసే లక్ష్యంతో వైద్య ఆరోగ్య శాఖ "రెడ్ వింగ్" సంస్థతో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు కేంద్రంగ
మారుమూల గిరిజన ప్రాంతాలకు అత్యవసర వైద్య సేవలను చేరువ చేసే లక్ష్యంతో వైద్య ఆరోగ్య శాఖ "రెడ్ వింగ్" సంస్థతో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు కేంద్రంగా దూరప్రాంతాల్లోని ఆసుపత్రులకు డ్రోన్ల ద్వారా మందులు, బ్లడ్ యూనిట్స్ పంపిణీ చేసేందుకు వీలుగా ఈ ఒప్పందం జరిగింది. ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్లో విజయవంతంగా సేవలు అందిస్తున్న సదరు సంస్థ, రాష్ట్రంలో 'ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్' కింద మొదటి 6-7 నెలల పాటు ఉచితంగా సేవలు అందించడానికి అంగీకరించింది. ఈ ఒప్పందం రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ వీరపాండ్యన్, సదరు సంస్థ ప్రతినిధి కుందన్ మాదిరెడ్డి మధ్య కుదిరినట్లు వైద్య ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. పాడేరును ప్రధాన కేంద్రం (హబ్)గా చేసుకుని, 60 నుంచి 80 కిలోమీటర్ల పరిధిలోని ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాలకు డ్రోన్ సేవలు అందుతాయి. ఈ డ్రోన్లలో మందులు మరియు వ్యాక్సిన్లు పాడవకుండా ఉండేలా కోల్డ్ చైన్ సదుపాయం కూడా ఉంటుంది. ఒక్కో డ్రోన్ సుమారు 2 కిలోల బరువును మోసుకెళ్ళే సామర్థ్యంతో పనిచేస్తుంది.