News14th Jan 05:13 PMSunil Byrisetty1 min read
నారావారిపల్లెలో మంత్రి లోకేష్ 81వ రోజు ప్రజాదర్బార్
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలోని నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 81వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. భోగి వేళ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ న
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలోని నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 81వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. భోగి వేళ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ ను కలిసేందుకు చుట్టపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు, టీడీపీ కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చారు. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించిన లోకేష్.. వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. వివిధ సమస్యలపై ప్రజలు, కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించారు. వారసత్వంగా తమకు సంక్రమించిన 1.83 ఎకరాల భూమిని అన్యాక్రాంతం చేశారని, విచారించి తగిన న్యాయం చేయాలని అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం బసినికొండ గ్రామానికి చెందిన పత్తి శివకుమార్ మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. తిరుమలలో అంగప్రదక్షణ భక్తులకు ఆఫ్ లైన్ ద్వారా టోకెన్స్ జారీ చేసేలా చర్యలు తీసుకోవాలని, ప్రస్తుతం ఉన్న ఆన్ లైన్ విధానాన్ని రద్దు చేయాలని ‘తిరుమలలో అంగప్రదక్షణ భక్తబృందం’ ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ ను కలిసి కోరారు. చిత్తూరు జిల్లా నిండ్రమండలం, కచ్చరావేడు గ్రామంలో దళితులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయడంతో పాటు గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థను నిర్మించాలని బి.శ్రీనివాసులు మంత్రి నారా లోకేష్ ను కలిసి విన్నవించారు. తిరుపతి, పరిసర ప్రాంతాల్లో 150 ఎస్టీ ఎరుకుల కుటుంబాలు చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాయని, ఆయా కుటుంబాలకు ఒకే ప్రాంతంలో ఇళ్ల స్థలాలు మంజూరుకు చర్యలు తీసుకోవాలని శ్రీ వేంకటేశ్వర ఎస్టీ ఎరుకల సంఘం ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు.