News12th Nov 04:29 PMSunil Byrisetty1 min read
వెలిగొండ పనులపై తీవ్ర అసంతృప్తి
వారం రోజుల వ్యవధిలోనే రెండోసారి వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించిన మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇటీవలే మొంథా తుఫాన్ కారణంగా దెబ్బతిన్న
వారం రోజుల వ్యవధిలోనే రెండోసారి వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించిన మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
ఇటీవలే మొంథా తుఫాన్ కారణంగా దెబ్బతిన్న ఫీడర్ కెనాల్, పడిన గండ్లు, జంట సొరంగాల్లో డీవాటరింగ్ పనులను ఇరిగేషన్ నిపుణుల బృందంతో కలసి మంత్రి నిమ్మల బుధవారం పరిశీలించారు. తను వచ్చి వారం రోజులైనా యుద్ధ ప్రాతిపదికన చేయాల్సిన డివాటరింగ్ పనులు, గండ్లు పూడ్చివేత పూర్తి కాకపోవటంతో 'ఇలా అయితే ఎలా అంటూ' అసహనం వ్యక్తం చేశారు. అత్యంత వెనుకబడిన, ఫ్లోరైడ్ బాధిత ప్రకాశం జిల్లా ప్రజలకు న్యాయం చేయాలంటే వెలిగొండ ప్రాజెక్టు పూర్తి తోనే సాధ్యమవుతుందన్నారు. ఈ ప్రాజెక్టు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి చిరకాల స్వప్నం అన్నారు. 1996లో ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్టుకు భూమి పూజ జరిగింది అన్నారు. మూడు దశాబ్దాలు గడుస్తున్నా ఈ ప్రాజెక్టు పూర్తి కాకపోవడం పట్ల ఆయన అనేక సందర్భాల్లో ఆవేదన చెందారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆయన ఈ ప్రాజెక్టు పై ప్రత్యేక శ్రద్ధ పెట్టి 2026లో ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు అన్నారు. ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉన్నా.. ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపట్టిన ఏజెన్సీలకి, పర్యవేక్షణ బాధ్యతలు చూస్తున్న అధికారులకు స్పందన లేకపోతే ఎలా అని మంత్రి రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.