News28th Oct 04:44 PMSunil Byrisetty1 min read
బీసీ హాస్టల్ విద్యార్థులను కంటికి రెప్పలా కాపాడుకుందాం
మొంథా తుఫాన్ నుంచి బీసీ హాస్టళ్లు, ఎంజేపీ స్కూళ్లో చదువుకునే విద్యార్థులను కంటికి రెప్పలా కాపాడుకుందామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత పిల
మొంథా తుఫాన్ నుంచి బీసీ హాస్టళ్లు, ఎంజేపీ స్కూళ్లో చదువుకునే విద్యార్థులను కంటికి రెప్పలా కాపాడుకుందామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత పిలుపునిచ్చారు. తుఫాన్ తీవ్రంగా ఉండే ప్రాంతాల్లోని విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని స్పష్టంచేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్.సత్యనారాయణ, ఎంజేపీ స్కూల్ కార్యదర్శి మాధవీలతతో మంత్రి సవిత మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. మొంథా తుఫాన్ నేపథ్యంలో బీసీ హాస్టళ్ల విద్యార్థుల రక్షణకు తీసుకున్న చర్యల గురించి జిల్లాల వారీగా మంత్రి సవిత అడిగి తెలుసుకున్నారు. పలువురు డీబీసీడబ్ల్యూవోలతోనూ మంత్రి స్వయంగా ఫోన్ చేసి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి సవిత సవిత మాట్లాడుతూ, వార్డెన్లు, ఏబీసీడబ్ల్యూవోలు, ప్రిన్సిపాళ్లు 24 గంటలూ హాస్టళ్లలో ఉండడడంతో పాటు రాత్రి సమయంలో విద్యార్థులతో కలిసి నిద్రపోయేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న హాస్టళ్ల విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో విద్యార్థులకు కాచి చల్లార్చిన నీరు, తాజా ఆహారం మాత్రమే అందివ్వాలన్నారు. తుఫాన్ దృష్ట్యా హాస్టళ్లను, ఎంజేపీ స్కూళ్లను నిరంతరం పర్యవేక్షించాలని, ఎప్పటికప్పుడు వాటి స్థితిగతులు, విద్యార్థుల ఆరోగ్యంపై నివేదిక ఇవ్వాలని బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి సత్యనారాయణను, ఎంజేపీ స్కూల్ కార్యదర్శి మాధవీలతను మంత్రి సవిత ఆదేశించారు.