News7th Sep 10:32 AMSunil Byrisetty1 min read
ధరల మంటతో సామాన్యుడి వంటిల్లు కుదేలు
ఆకాశాన్నంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో పేదలు, కార్మికులు, రైతులు, ఉద్యోగులు, చిరు వ్యాపారులు, మధ్యతరగతి కుటుంబాల బతుకులు భారంగా మారాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య
ఆకాశాన్నంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో పేదలు, కార్మికులు, రైతులు, ఉద్యోగులు, చిరు వ్యాపారులు, మధ్యతరగతి కుటుంబాల బతుకులు భారంగా మారాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య అన్నారు. ఒకవైపు ప్రజల ఆదాయాలు ఆశించిన స్థాయిలో పెరగకపోగా, మరోవైపు రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు కుటుంబ బడ్జెట్లను ఛిద్రం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కూరగాయలు కొనలేని పరిస్థితి, పప్పు వండాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి, వంటనూనె వినియోగించాలంటే జేబు చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, సామాన్యుడి వంటిల్లు నేడు అగ్నిగుండంగా మారిందని పేర్కొన్నారు. 2014తో పోలిస్తే నేడు నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగినట్లు కేంద్ర ప్రభుత్వ అధికారిక గణాంకాలే వెల్లడిస్తున్నాయని తెలిపారు. బియ్యం కిలో ధర ₹28.06 నుంచి ₹45.69కు పెరిగిందని, అంటే సుమారు 63 శాతం పెరుగుదల నమోదైందన్నారు. కందిపప్పు ధర ₹75.94 నుంచి ₹122.06కు పెరిగి సుమారు 61 శాతం పెరిగిందని తెలిపారు. సన్ఫ్లవర్ వంటనూనె ధర ₹93.55 నుంచి ₹192.40కు పెరిగి 105 శాతం మేర పెరిగిందని, చక్కెర ధర ₹34.02 నుంచి ₹60.78కు పెరిగి సుమారు 79 శాతం, ఉల్లిపాయ ధర ₹26.46 నుంచి ₹50.19కు పెరిగి సుమారు 90 శాతం, టమాటా ధర ₹21.44 నుంచి ₹37.67కు పెరిగి సుమారు 76 శాతం పెరిగిందని వివరించారు. ముఖ్యంగా వంటనూనె ధర రెట్టింపుకుపైగా పెరగడం, ఉల్లిపాయ ధర దాదాపు రెట్టింపు కావడం, బియ్యం, కందిపప్పు, చక్కెర, టమాటా ధరలు గణనీయంగా పెరగడం ప్రజలపై పడుతున్న ధరల భారానికి నిదర్శనమన్నారు.