News15th Aug 10:58 AMSunil Byrisetty1 min read
అసెంబ్లీ సమావేశాలకు పటిష్ట ఏర్పాట్లు
17వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఆంధ్రప్రదేశ్ శాసన మండలి, శాసన సభ సమావేశాలను ప్రశాంతంగా, సమర్థవంతంగా, విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ముందస్తు ఏర్పాట్లను పటిష్టంగా చేపట్టాల
17వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఆంధ్రప్రదేశ్ శాసన మండలి, శాసన సభ సమావేశాలను ప్రశాంతంగా, సమర్థవంతంగా, విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ముందస్తు ఏర్పాట్లను పటిష్టంగా చేపట్టాలని శాసన మండలి అధ్యక్షులు కొయ్యే మోషేను రాజు, శాసన సభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు చింతకాయల అధికారులను ఆదేశించారు. సభా సమావేశాల్లో సభ్యులు అడిగే ప్రశ్నలకు నిర్ణీత సమయంలో సమాధానాలు అందించడం అత్యంత ప్రాధాన్యతతో కూడిన అంశమని పేర్కొన్నారు. అయితే కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉండటం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ప్రశ్నలను సమీక్షించి, వాటిపై తగిన నిర్ణయం తీసుకోవాలని, అవసరమైన చోట చట్టబద్ధమైన విధానాన్ని అనుసరించి పెండింగ్ జాబితా నుంచి తొలగించే ప్రక్రియను చేపట్టాలని సూచించారు. సమావేశాల సందర్భంగా మంత్రులు, సంబంధిత శాఖల తరఫున ఇచ్చే హామీల అమలుపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని వారు అధికారులకు సూచించారు. సభ్యులకు సంబంధించిన సంక్షేమ అంశాలపై కూడా వారు అధికారులతో చర్చించారు. సభ్యుల పెండింగ్ మెడికల్ బిల్లుల చెల్లింపులను సత్వరమే పరిష్కరించి, అర్హత కలిగిన క్లెయిమ్లకు ఎటువంటి జాప్యం లేకుండా చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశాలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో జరిగేలా పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని అదనపు డీజీపీ మధుసూదన రెడ్డిని ఆదేశించారు. ఈసారి డిజిటల్ పాస్ల విధానాన్ని అమలు చేస్తున్నందున, పాస్లను తప్పనిసరిగా స్కాన్ చేసి, వాటి ధ్రువీకరణ అనంతరం మాత్రమే అనుమతించాలని సూచించారు.