News17th Jan 12:39 PMSunil Byrisetty1 min read
రాజధానిలో సిబ్బంది కొరత
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో సిబ్బంది కొరత తీవ్ర సమస్యగా ఉంటోంది. రాజధాని నిర్మాణానికి రెండో దశ భూ సమీకరణతో పాటు లేఅవుట్ పనులు పెద్దఎత్తున జరుగుతున్న నేపథ్యంలో ఈ పనులు పర్యవేక్షి
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో సిబ్బంది కొరత తీవ్ర సమస్యగా ఉంటోంది. రాజధాని నిర్మాణానికి రెండో దశ భూ సమీకరణతో పాటు లేఅవుట్ పనులు పెద్దఎత్తున జరుగుతున్న నేపథ్యంలో ఈ పనులు పర్యవేక్షించాల్సిన రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సిఆర్డిఎ)లో అధికారుల కొరత పెరుగుతోంది. ప్రస్తుతం గ్రామాల్లో రైతులు లేవనెత్తుతున్న సమస్యలు, వారి డిమాండ్లపై దృష్టి సారించి వీలైనంత త్వరగా పరిష్కారం చేయాలంటే స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు (ఎస్టిసిలు) అవసరం ఉంది. అయినా ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల సిఆర్డిఎకు సుమారు 700 పోస్టులకు అనుమతి వచ్చినా ఎస్డిసీల విషయంలో తీవ్ర కొరత ఏర్పడింది. తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల పరిధిలో ప్రస్తుతం 25 రెవెన్యూ గ్రామాలున్నాయి. వీటిల్లో 29 ల్యాండ్ పూలింగు యూనిట్లు ఉన్నాయి. ఇప్పుడు రెండోదశ పూలింగులో మరో 9 యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారు. పరిపాలనా పరమైన పనులు మినహాయిస్తే భూ సమీకరణ యూనిట్ల నిర్వహణకే 38 మంది ఎస్ డి సిలు అవసరం ఉంది. ప్రస్తుతం మొత్తంగా ఏడుగురు నియమితులు కాగా వీరిలోనూ ఒకరు గత నెల రోజుల క్రితం సెలవుపై వెళ్లారు. దీంతో పూర్తిస్థాయి విధుల్లో ఉన్నది ఆరుగురే. రెండో దశ భూ సమీకరణ పరిధిలోని యూనిట్ల బాధ్యతలు వీరికే అప్పగించారు.