News1st Dec 05:10 PMSunil Byrisetty1 min read
ప్రైవేటు ఆలయాలపై ప్రత్యేక దృష్టి
రాష్ట్రంలోని ప్రైవేటు ఆలయాలు, అందులో భక్తుల రద్దీ పట్ల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ అధికారులను ఆదేశించారు. సచి
రాష్ట్రంలోని ప్రైవేటు ఆలయాలు, అందులో భక్తుల రద్దీ పట్ల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ అధికారులను ఆదేశించారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్లో ఆ సంస్థ కార్యకలాపాలు, పీపుల్స్ పర్సెప్షన్పై ఆయన సమీక్ష నిర్వహించారు. రాబోయే రోజుల్లో వరుసగా పండగలు, ప్రత్యేక పర్వదినాలు వస్తున్నాయి, కాబట్టి అన్ని ఆలయాల్లోనూ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని చెప్పారు. జిల్లాలో అధికారులు తమ తమ పరిధిలో ఉన్న ప్రైవేటు ఆలయాల పర్యవేక్షణపైన కూడా దృష్టి సారించాలన్నారు. ప్రైవేటు ఆలయాల నిర్వాహకుల నుంచి పండుగలు, పర్వదినాల సమయంలో ఆయా ఆలయాలకు ఎంత మంది భక్తులు రావచ్చు, రద్దీ నియంత్రణకు ఆలయ నిర్వాహకులు చేపడుతున్న చర్యల గురించి ముందుగా అధికారులకు తెలియజేయాలని ఆదేశిస్తూ చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే భక్తుల రద్దీ నియంత్రణకు ముందుస్తుగా పోలీసుల అనుమతి తీసుకుని, అక్కడ తగిన బందోబస్తు ఏర్పాటు చేసేలా చూడాలన్నారు. వైకుంఠ ఏకాదశి, ధనుర్మాసం తదితర పర్వదినాలు, పండుగల వేళల్లో ఆలయాలకు వచ్చే భక్తుల రద్దీ నియంత్రణకు, ఆలయ నిర్వాహకులు, ధర్మకర్తలు చేపట్టాల్సిన చర్యలకు సంబంధించి ఒక నిబంధనావళిని రూపొందించి అన్ని ప్రైవేటు ఆలయాలకు జారీ చేయాలన్నారు.