Politics26th Jan 05:16 PMSunil Byrisetty1 min read
వెలిగొండకు ఏం చేశారని క్రెడిట్ చోరీ?
రైతాంగానికి శరవేగంగా సాగునీరు అందించాలన్న సంకల్పంతో సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు శ్రీకారం చుట్టి 80 శాతం పనులు పూర్తి చేస్తే.. కేవలం రూ.170 కోట్ల పనులు చేసి ప్రాజెక్టు పూర్తి
రైతాంగానికి శరవేగంగా సాగునీరు అందించాలన్న సంకల్పంతో సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు శ్రీకారం చుట్టి 80 శాతం పనులు పూర్తి చేస్తే.. కేవలం రూ.170 కోట్ల పనులు చేసి ప్రాజెక్టు పూర్తి చేసినట్టు జాతికి అంకితం చేశానంటూ రైతాంగాన్ని జగన్ మోసం చేశాడని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మండిపడ్డారు. "2014–19 మధ్య కాలంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.1,500 కోట్లు ఖర్చు చేసి మొదటి టన్నెల్ 17.8 కి.మీ., రెండో టన్నెల్ 12.01 కి.మీ. మేర టన్నెల్ బోరింగ్ మిషన్ ద్వారా నిబంధనల ప్రకారం పూర్తి చేశాం. కానీ 2019–24 మధ్య అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం వెలిగొండ ప్రాజెక్టును పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. దాదాపు జగన్ ప్రభుత్వం రూ.3 వేల కోట్లకు పరిపాలన అనుమతులు ఇచ్చి కేవలం రూ.170 కోట్ల పనులు చేసి, నేడు చంద్రబాబు ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా పేలుళ్లతో టన్నెల్స్లొ మాన్యువల్ పనులు చేపట్టి ప్రాజెక్టును దెబ్బతీశారు. తూర్పు ప్రధాన కాలువ, తీగలేరు కాలువ పనులు, వంతెనలు, హెడ్ రెగ్యులేటర్ అసంపూర్తిగానే ఉన్నాయి. ఐదేళ్ల జగన్ పాలనలో మొత్తం ప్రాజెక్టును నిర్వీర్యం చేశారు. జగన్ ఐదేళ్లలో టన్నెల్–2లో కేవలం 745 మీటర్ల బెంచింగ్, 705 మీటర్ల లైనింగ్ మాత్రమే జరిగితే... కూటమి ప్రభుత్వంలో 18 నెలల్లోనే 6,579 మీటర్ల బెంచింగ్, 3,644 మీటర్ల లైనింగ్ పనులు పూర్తయ్యాయి. ఈ 18 నెలల పాలనలో దాదాపు రూ.1,039 కోట్లు కేటాయించి పనులు చేస్తున్నామ"ని ఎమ్మెల్యే సాంబశివరావు వివరించారు.