News15th Nov 12:49 PMSunil Byrisetty1 min read
కాకి వల్ల కాలిబూడిదైన నాలుగు ఇళ్లు..
విజయనగరం జిల్లాలో ఓ కాకి చేసిన పనికి నాలుగు తాటాకు ఇళ్లు కాలి బూడిదయ్యాయి. ఈ ప్రమాదానికి కారణం ఓ కాకి చేసిన పనేనని స్థానికులు చెబుతున్నారు. కార్తీక మాసం నేపథ్యంలో గరివిడి మండలం కోన
విజయనగరం జిల్లాలో ఓ కాకి చేసిన పనికి నాలుగు తాటాకు ఇళ్లు కాలి బూడిదయ్యాయి.
ఈ ప్రమాదానికి కారణం ఓ కాకి చేసిన పనేనని స్థానికులు చెబుతున్నారు. కార్తీక మాసం నేపథ్యంలో గరివిడి మండలం కోనూరులో ఓ కుటుంబం తమ ఇంటి డాబాపై దీపాలను వెలిగించింది. అయితే ఓ కాకి ఇందులో ఓ దీపాన్ని ఎత్తుకెళ్లి సమీపంలోని ఓ ఇంటిపై పడేసింది. ఆ ఇంటి పైకప్పు తాటాకులతో ఉండడం వల్ల నిప్పంటుకుని మంటలు ఎగసిపడ్డాయి. స్థానికులు అప్రమత్తమై మంటలు ఆర్పేందుకు ప్రయత్నించేలోపే చుట్టుపక్కల ఉన్న ఇళ్లకు మంటలు విస్తరించాయి. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో మంటలను అదుపుచేశారు. ఆలోపే నాలుగు తాటాకు ఇళ్లు కాలిబూడిదయ్యాయి. కాగా, తహసీల్దారు సీహెచ్ బంగార్రాజు ఘటనాస్థలాన్ని పరిశీలించి, సుమారు రూ.4 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేశారు. ప్రభుత్వం నుంచి ఆర్థికసాయం అందేలా చూస్తామని బాధితులకు హామీ ఇచ్చారు.