Telangana9th Jan 12:11 PMSunil Byrisetty1 min read
వాహనం కొన్న చోటే రిజిస్ట్రేషన్
కొత్త వాహనం కొనుగోలు చేస్తున్నారా.. రిజిస్ట్రేషన్ కోసం రవాణా శాఖ (ఆర్టీఏ) కార్యాలయాల చుట్టూ తిరగక్కర్లేదు. కొనుగోలు చేసిన షోరూమ్లోనే శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేసేందుకు
కొత్త వాహనం కొనుగోలు చేస్తున్నారా.. రిజిస్ట్రేషన్ కోసం రవాణా శాఖ (ఆర్టీఏ) కార్యాలయాల చుట్టూ తిరగక్కర్లేదు. కొనుగోలు చేసిన షోరూమ్లోనే శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేసేందుకు వీలు కల్పిస్తూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త విధానం అమలు కోసం అవసరమైన సాఫ్ట్వేర్ను రాబోయే 15 రోజుల్లో సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. దీని ప్రకారం, వాహన డీలర్లే కొనుగోలుదారుడి నుంచి అవసరమైన పత్రాలను (ఇన్వాయిస్, ఫారం-21, ఫారం-22, ఇన్సూరెన్స్, చిరునామా ధ్రువీకరణ పత్రం) తీసుకుని ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. రవాణా శాఖ అధికారి ఆ పత్రాలను ఆన్లైన్లోనే పరిశీలించి, డిజిటల్గా ఆమోదం తెలుపుతారు. ఆ తర్వాత వాహనానికి రిజిస్ట్రేషన్ నెంబర్ కేటాయించి, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (ఆర్సీ) కార్డును నేరుగా యజమాని చిరునామాకు పోస్టులో పంపిస్తారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రతిరోజూ సుమారు 3,000 వాహనాలు రిజిస్ట్రేషన్ అవుతుంటాయి. ఈ నేపథ్యంలో, కొత్త విధానం అమల్లోకి వస్తే లక్షలాది మంది వాహనదారులకు లబ్ధి చేకూరనుంది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన 'వాహన్', 'సారథి' పోర్టళ్లను ఈ ప్రక్రియ కోసం పూర్తిస్థాయిలో వినియోగించుకోనున్నారు.