News12th Nov 05:30 PMSunil Byrisetty1 min read
భాగస్వామ్య సదస్సుకు సన్నద్ధమైన విశాఖ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) సంయుక్తంగా నిర్వహిస్తున్న 30వ ‘సి.ఐ.ఐ పార్ట్నర్షిప్ సమ్మిట్-2025’ కోసం విశాఖ సన్నద్ధం అయ్యింది. సదస్సును
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) సంయుక్తంగా నిర్వహిస్తున్న 30వ ‘సి.ఐ.ఐ పార్ట్నర్షిప్ సమ్మిట్-2025’ కోసం విశాఖ సన్నద్ధం అయ్యింది. సదస్సును విజయవంతంగా నిర్వహించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. అందుకు తగినట్టుగా అధికార యంత్రాగాన్ని సన్నద్ధం చేశారు. ‘ఇన్వెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్’ అనే సందేశాన్ని ఈ సమ్మిట్ ద్వారా ప్రపంచానికి చాటి చెప్పాలని ముఖ్యమంత్రి సంకల్పించారు. గ్రీన్ ఎనర్జీ, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, స్పేస్, డిఫెన్స్, టూరిజం రంగాల్లో భారీగా పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు విశాఖపట్నంను భారత తూర్పు తీరంలో గ్లోబల్ ట్రేడ్ గేట్వే గా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. విశాఖలోని ఆంధ్ర విశ్వ విద్యాలయ ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా సదస్సు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. పార్టనర్స్ ఇన్ ప్రోగ్రెస్ – ఇండియాస్ రోడ్ మ్యాప్ టు వికసిత్ భారత్-2047’ థీమ్తో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. 100కి పైగా విదేశీ ప్రతినిధులు పాల్గొనే అవకాశంతో పాటు పెట్టుబడులకు సంబంధించి 30కి పైగా అవగాహనా ఒప్పందాలు జరగనున్నాయి. బుధవారం నుంచి సదస్సు ముగిసే శనివారం వరకు వివిధ సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అవుతారు. రాష్ట్రంలో ప్రాంతాల వారీగా వివిధ రంగాల్లో పెట్టుబడులకు గల అవకాశాలను ముఖ్యమంత్రి ఈ వేదిక నుంచి వారికి వివరించనున్నారు. అలాగే రౌండ్ టేబుల్ సమావేశాలు, ప్రధాన థీమ్ సెషన్లు నిర్వహిస్తారు. పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.