Politics12th Nov 03:17 PMSunil Byrisetty1 min read
సీబీఐ కోర్టుకు జగన్.. 21లోగా హాజరు
మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ సీబీఐ కోర్టులో వ్యక్తిగతంగా హాజరు కావడం తప్పేలా లేదు. ఈ నెల 21వ తేదీలోగా హైదరాబాద్లోని సీబీఐ కోర్టు ఎదుట హాజరుకానున్నారు. ఈ మేరకు ఆయన తరఫు న్యాయవాది
మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ సీబీఐ కోర్టులో వ్యక్తిగతంగా హాజరు కావడం తప్పేలా లేదు. ఈ నెల 21వ తేదీలోగా హైదరాబాద్లోని సీబీఐ కోర్టు ఎదుట హాజరుకానున్నారు. ఈ మేరకు ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. గతంలో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ దాఖలు చేసిన మెమోను జగన్ ఉపసంహరించుకున్నారు. యూరప్ పర్యటనకు వెళ్లేందుకు జగన్కు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే, పర్యటన ముగించుకుని తిరిగి వచ్చాక నవంబర్ 14న కచ్చితంగా వ్యక్తిగతంగా హాజరుకావాలని షరతు విధించింది. ఈ గడువు సమీపిస్తున్న వేళ, ఈ నెల 6న వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ ఆయన మెమో దాఖలు చేశారు. ఈ మెమోపై సీబీఐ ప్రధాన కోర్టు న్యాయమూర్తి డాక్టర్ టి.రఘురాం విచారణ చేపట్టారు. జగన్కు మినహాయింపు ఇవ్వడాన్ని ఈ సందర్భంగా సీబీఐ తీవ్రంగా వ్యతిరేకించింది. బెయిల్ షరతుల ప్రకారం ప్రతి విచారణకు ఆయన హాజరుకావాల్సిందేనని స్పష్టం చేస్తూ కౌంటర్ దాఖలు చేసింది. దీంతో తాము ఈ నెల 21వ తేదీలోగా కోర్టు ముందు హాజరవుతామని పేర్కొంటూ కొత్త మెమో దాఖలు చేస్తున్నట్లు న్యాయవాది తెలిపారు.