Politics7th Aug 04:12 PMSunil Byrisetty1 min read
రెండో రోజూ కొనసాగిన రిలే నిరాహార దీక్షలు
రాష్ట్రంలో నిరుద్యోగ యువత సమస్యలు, డీఎస్సీ నియామకాలు, స్పోర్ట్స్ కోటా భర్తీలో జరిగిన పారదర్శకత లోపంపై వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు రెండో రోజూ హోరెత్తాయి.
రాష్ట్రంలో నిరుద్యోగ యువత సమస్యలు, డీఎస్సీ నియామకాలు, స్పోర్ట్స్ కోటా భర్తీలో జరిగిన పారదర్శకత లోపంపై వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు రెండో రోజూ హోరెత్తాయి. విజయవాడ ధర్నా చౌక్లో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజీ డిప్యూటీ మేయర్ శైలజ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు వైఎస్సార్సీపీ ముఖ్య నేతల నేతృత్వంలో ఈ దీక్షా కార్యక్రమం కొనసాగింది. వైసీపీ నేతలు మాట్లాడుతూ డీఎస్సీ నియామకాలు, స్పోర్ట్స్ కోటా 400 ఉద్యోగాల భర్తీలో భారీగా అక్రమాలు జరిగాయని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లేవనెత్తిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పలేక తీవ్ర అసహనంతో ఉందన్నారు. సమాధానం చెప్పాల్సిన బాధ్యత కలిగిన మంత్రులు తప్పుకుని, అధికారులను ముందుకు నెట్టడం ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనమని విమర్శించారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగి నవీన్కు టాపర్ ర్యాంక్ రావటం, ఆపై అతని పేరును తొలగించి రెండో ర్యాంక్ నుంచి జాబితాను ప్రారంభించడం వెనుక ఉన్న పారదర్శకత ఎక్కడ అని ఆయన నిలదీశారు. కూటమి ప్రభుత్వంలో రౌడీయిజం పెరిగిపోయిందని మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. రౌడీల తోలు తీస్తా అని చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడి పార్టీలోనే రౌడీలు ఉన్నారనడానికి ఈ దాడులే ప్రత్యక్ష నిదర్శనమని మండిపడ్డారు.